తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం ఇప్పుడే కొట్లాట షురువైంది. తమకు ఆ టికెట్ కావాల్సిందేనని, తమ అనుచరులకు ఫలానా సీటు నుంచి టికెట్ ఇవ్వాల్సిందేనని సీనియర్లు పంతంతో ఉన్నారు. తమ అనుచరులకు హామీలు కురిపిస్తున్నారు. దీంతో సీనియర్ల మధ్య దూరం పెరుగుతున్నది. ఈ విషయం హైకమాండ్ తెలియడంతో వారికి మొట్టికాయలు వేసినట్టు తెలిసింది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం కూడా ఊపందుకున్నది. టీకాంగ్రెస్లో సీనియర్ నేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే పనిలో ఉన్నారు. అంతేకాదు, తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు తమ వారసత్వాన్ని కూడా ఎన్నికల్లో బరిలో నిలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ హోదాను కాపాడుకుంటూనే తమ బలగానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే ఉబలాటంలో ఉన్నారు. అంతేకాదు, తమ అనుచరులకూ టికెట్ గ్యారంటీ అనే హామీలు ఇస్తుండటం పార్టీలో అంతర్గతంగా అసహనాన్ని రేపుతున్నది. ఒకే జిల్లాలో ఒకరికి మించి మంచి సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. తమ అనుచరులను కాపాడుకోవాలని, తమ వారసులకు టికెట్లు సాధించాలని, తమకే ఉన్నత పదవులు దక్కాలని పోటీ పడుతున్నారు. ఇది అంతర్గతంగా ఆయా నేతల మధ్య దూరాన్ని పెంచుతున్నది.
ఎమ్మెల్యేలు తక్కువున్నా సీఎం క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అని రాజకీయవర్గాలు సాధారణంగా అంటుంటాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీలో తలలు పండిన సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. వారిపై గంపెడు ఆశలతో క్యాడర్ కూడా వెంట ఉన్నది. అయితే, వీరికి ఆ సీనియర్ నేతలు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతున్నది. ఫలానా టికెట్ తన అనుచరుడికే అనే మాటలతో సమీప సీనియర్ లీడర్, ఆయన అనుచరులు నొచ్చుకుంటున్నారు. ఇది పార్టీలోపలే వారి మధ్య తీవ్ర పోటీని ఇస్తున్నది. దీంతో వేరే పార్టీల నేతల కంటే సొంత పార్టీల నేతలనే టార్గెట్ చేయడం కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి.
Also Read: రెండు శిబిరాలకూ దూరంగా బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ.. ఎవరి లెక్కలు వారికున్నాయిగా..!
టికెట్ల కోసం, పదవుల కోసం పార్టీ నేతలే పోటాపోటీగా ప్రయత్నాలు చేయడం, ఎదుటి వర్గంపై దుమ్మెత్తిపోయడం వంటి విషయాలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి చేరింది. దీంతో అలాంటి నేతలపై కాంగ్రెస్ హైకమాండ్ తలంటింది.
ఏ సీనియర్ నేతో హామీ ఇచ్చాడని, మరెవరో మాట ఇచ్చారని టికెట్ల పంపిణీ జరగబోదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించాల్సిందేనని, ఇష్టారీతిన టికెట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆ నియోజకవర్గంలో ఫలానా నేతకు మంచి ప్రాబల్యం ఉన్నది.. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తలిస్తేనే వారి సామర్థ్యాలను, శక్తిని బట్టి టికెట్ కేటాయిచండం ఉంటుందని హైకమాండ్ వెల్లడించింది. టికెట్ల పంపిణీ హైకమాండ్ చేతిలో ఉంటుందని వివరించింది.
