పెద్దమ్మగుడిలో రేవంత్ పూజలు: గాంధీభవన్ కు ర్యాలీగా
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లే ముందు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లే ముందు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుండి రేవంత్ రెడ్డి ఓపెన్ టాప్ వాహనంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహా పలువురు మాజీ మంత్రులు, నేతలతో కలిసి గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు.
జూభ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం నాంపల్లిలోని దర్గాకు ఆయన ర్యాలీగా వెళ్లారు. నాంపల్లిలోని దర్గాలో చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ గా రేవంత్ రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం బాధ్యతలను కట్టబెట్టింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టడాన్ని పార్టీ సీనియర్లు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.