తెలంగాణ కాంగ్రెస్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి స్పందించారు.
తెలంగాణ కాంగ్రెస్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి స్పందించారు. సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ఇష్యూ తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని తెలిపారు. జగ్గారెడ్డి అధిష్టానాన్ని అపాయింట్మెంట్ కోరారని.. జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామని రేవంత్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
గతంలో వీహెచ్పై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని రేవంత్ చెప్పారు. పీసీసీ చీఫ్గా కొన్ని విషయాలు తాను బయటకు చెప్పలేనని అన్నారు. జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని రేవంత్ తెలిపారు. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు.
ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు సిద్దమైన జగ్గారెడ్డిని పలువురు సీనియర్ నేతలు బుజ్జగించడంతో.. ఆయన తన నిర్ణయాన్ని 15 రోజులు వాయిదా వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్తోనే జగ్గారెడ్డి సమస్య ఉన్నది బహిరంగ రహస్యమే. సోనియా, రాహుల్కు రాసిన లేఖలో కూడా రేవంత్ రెడ్డిపై పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక, జగ్గారెడ్డి వ్యవహారాన్ని కుటుంబంలో సమస్యగా చెప్పిన రేవంత్ రెడ్డి.. అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. తన సమస్య పార్టీ అంతర్గతం అని పీసీసీ అధ్యక్షుడు అనడం సహజమని.. కానీ టీ కప్పులో తుపాన్ అని కొట్టిపారేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సమస్యల ఎందుకు వచ్చిందో ఆలోచించడం లేదని అన్నారు. మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్తో తన సమస్య పరిష్కారం కాదని.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలను కలిస్తేనే తన సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.
