దిగొచ్చిన రేవంత్ రెడ్డి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణ చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం టీ కాంగ్రెస్లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిగా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిణామాలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా రేవంత్ రెడ్డి దిగొచ్చి.. వెంకట్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇక, ఈ రోజు నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనుంది. ఇందుకు కొన్ని గంటల ముందు వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. మరి రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింద.ి
ఇక, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల సన్నాహక సమావేశాలకు పార్టీ అధిష్టానం తనను ఆహ్వానించడం ఆరోపించారు. సమావేశాల గురించి తనకు తెలియదని.. కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.
తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కల్గించిందన్నారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. ‘‘నన్ను అవమానిస్తే పార్టీని వీడుతానని వారు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి తీసుకెళ్తాను. పార్టీ నాయకుల నుంచి తనకు జరిగిన అవమానాలను వివరిస్తాను’’ అని ఆయన చెప్పారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ సీనియర్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తోంది.