మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లిన రేవంత్, కోమటిరెడ్డిలు ఆయనతో చర్చలు జరిపారు.

హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లిన రేవంత్, కోమటిరెడ్డిలు ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డితో మరికొందరు ముఖ్య నేతలు కూడా జూపల్లి నివాసానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు జూపల్లి నివాసంలో లంచ్ చేశారు. అనంతరం రేవంత్, కోమటిరెడ్డి, జూపల్లిలు మీడియాతో మాట్లాడారు. 

రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే బీఆర్ఎస్‌ను గద్దె దించలగమని అన్నారు. తద్వారా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇంకా చాలా మంది పెద్దలు కాంగ్రెస్‌లో చేరతారనే విశ్వాసం ఉందన్నారు. జూపల్లి కృష్ణారావును కలిసి పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణలో 15 స్థానాలు గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. 

Also Read: చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు.. కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డితో రేవంత్ భేటీ..

పెద్దలు తమ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ రేపు సాయంత్రం విదేశీ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. రాహుల్ సమయం తీసుకుని.. మంచి కార్యక్రమాన్ని మంచి ముహుర్తంలో చేపడతామని చెప్పారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ అభివృద్ది కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం జూపల్లి పోరాడారని అన్నారు. జూపల్లి కృష్ణారావు, కూచకుళ్ల దామోదర్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చెప్పారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని జూపల్లి కృష్ణారావు చెప్పారని తెలిపారు. జూపల్లి చేరితే కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. 

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డిలు తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానివి ప్రజలను మభ్యపెట్టే పథకాలని విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించినవారిని హింసిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని నాలుగేళ్ల క్రితమే ఎదురుతిరిగామని చెప్పారు. బీఆర్ఎస్‌ది దుర్మార్గమైన నియంతృత్వ పాలన అని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌లో చేరికపై మీడియా ప్రశ్నించగా.. ఇంకా సమయం ఉందని జూపల్లి సమాధానమిచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని అన్నారు.