గుడ్న్యూస్: సింగరేణిలో రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంపు
సింగరేణి సంస్థలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారు. ఇవాళ సింగరేణి సంస్థ బోర్డు మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.
హైదరాబాద్:సింగరేణి సంస్థలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచినట్టుగా ఆ సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని ఇటీవల ఆదేశించారు. దీంతో సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సింగరేణి సంస్థలో కూడా దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
జులై 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంత ప్రజానిధులు, సంస్థ ఛైర్మన్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింగరేణిలో కూడా 61 సంవత్సరాల వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సమావేశంలో బోర్డు తన ఆమోదం తెలిపినట్లు ఎండీ ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు నిర్ణయాన్ని మార్చి 31వ తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించింది. దీని వలన సింగరేణి ఆధికారులు, కార్మికులు కలిపి మొత్తం 43,899 మందికి లబ్ది చేకూరనుంది.
మార్చి 31 తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్ అయిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వయో పరిమితి పెంపును సింగరేణి విద్యా సంస్థల్లో కూడా అమలు జరపనున్నారు.
కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పెళ్లైన లేదా విడాకులు తీసుకొని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయో పరిమితికి లోబడి కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదించింది.
సామాజిక బాధ్యతా కార్యక్రమాల (సీఎస్ఆర్) నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు వెచ్చించడానికి బోర్డు ఆమోదించింది. అలాగే వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. రామగుండం లో కొత్తగా ప్రారంభించనున్న ఆర్జీ ఓసీ-5కు సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
ఫస్ట్ క్లాస్ మైన్ మేనేజర్ సర్టిఫికెట్ ఉన్న మైనింగ్ అధికారుల డిజిగ్నేషన్ మార్పు పై కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఎగ్జిక్యూటీవ్, ఎన్.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగ నియామకాలలో గతంలో ఉద్యోగ నిబంధనల ప్రకారం కొన్ని లింగపరమైన ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అన్ని పోస్టులకు లింగ భేదాన్ని తొలగిస్తూ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడాలికి వీలుగా బోర్డు అంగీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణ లో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించడానికి కూడా బోర్డు ఆమోదించింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ పి.ఎస్.ఎల్.స్వామి, డిప్యూటీ సెక్రటరీ అజితేష్ కుమార్, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ చైర్మన్ ఎం.డి. శ్రీ మనోజ్ కుమార్, సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ ప్లానింగ్, పర్సనల్) ఎన్.బలరామ్, డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు పాల్గొన్నారు.