ఇండిగో విమానంలో తెలుగు మహిళపై వివక్ష.. ఘటనపై మంత్రి కేటీఆర్ ఎమన్నారంటే..?
IndiGo flight: భాష రాలేదన్న కారణంతో మనుషులను అవమానించడం తగదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హిందీ, ఇంగ్లీష్ భాష రాదనే కారణంతో ఇండిగో విమానంలో సిబ్బంది ప్రవర్తించిన తీరును ఆయన ఖండించారు.
Telangana minister KTR: ఇండిగో విమానంలో తెలుగు మహిళకు అవమానం జరిగింది. భాష పేరుతో వివక్షకు గురైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అహ్మదాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత ఫోటోని షేర్ చేస్తూ సంబంధిత వివరాలను పంచుకున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) స్పందించారు. ఇండిగో విమాన సిబ్బంది తీరును ఖండించారు. భాష రాలేదన్న కారణంతో మనుషులను అవమానించడం తగదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హిందీ, ఇంగ్లీష్ భాష రాదనే కారణంతో ఇండిగో విమానంలో సిబ్బంది ప్రవర్తించిన తీరును ఆయన ఖండించారు. ఇండిగో విమాన సర్వీస్ ను ట్యాగ్ చేస్తూ తన అభిప్రాయం పంచుకున్నారు. ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. భాష పేరుతో ఎందుకు ఈ వివక్ష అంటూ నెటిజన్లు సైతం ఇండిగో విమాన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ స్థానిక భాషను గౌరవించాలని ఇండిగో విమాన సర్వీసులకు సూచించారు. అలాగే, హిందీ, ఇంగ్లీష్ తెలియని ప్రయాణికులను గౌరవించాలని హితవుపలికారు. "ప్రియమైన @IndiGo6E మేనేజ్ మెంట్, స్థానిక భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ తెలియని ప్రయాణికులను గౌరవించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రాంతీయ రూట్లలో, తెలుగు, తమిళం, కన్నడ మొదలైన స్థానిక భాషలను మాట్లాడగల మరింత మంది సిబ్బందిని నియమించుకోండి. ఇది విజయవంతమైన పరిష్కారం అవుతుంది" అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ ను ఇండిగో విమానయాన సంస్థకు ట్యాట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఇండిగో తీరుపై మండిపడుతున్నారు.
భాష పేరుతో తెలుగు మహిళకు వివక్ష..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి తెలంగాణాలోని హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సిబ్బంది తెలుగు తప్ప ఇదర భాషలు తెలియని ఒక మహిళపట్ల ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీష్, హిందీ రాదనే కారణంతో ఆమె సీటు మార్చి.. ఇండిగో విమాన సిబ్బంది వివక్షను చూపారు. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 16న ఒక తెలుగు తెలుగు మహిళ ఏపీలోని విజయవాడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు ప్రయాణం చేసింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది.. సదరు మహిళకు ఇంగ్లీష్, హిందీ భాషలు రావనే కారణంతో ఆమె సీటును మార్చారు. భాషల పేరుతో ఇలా అవమానించడం గురించి అందులోనే ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు, అహ్మదాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత ఫోటోని షేర్ చేస్తూ సంబంధిత వివరాలను పంచుకున్నారు. ఆమె సీటు 2ఏ(ఎక్స్ఎల్ సీటు, ఎగ్జిట్ రో)లో ఆమె కూర్చోని ఉండగా.. ఇండిగో సిబ్బంది ఆమెను 3సీ సీట్లోకి మార్చేశారు. అక్కడి సిబ్బంది తీరును ఖండిస్తూ.. ఈ వివక్షను ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.