జాతీయతకు బిజెపి కొత్త నిర్వచనం... ఇక దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనదే..: కేశవ రావు
తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బిజెపిపై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రజలందరినీ సమానంగా చూడటంలేదని... కులం, మతాలు, భాషల పేరుతో వారిలో భేదాభిప్రాయాలు తీసుకురావడం బాధాకరమని టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మండిపడ్డారు. బిజెపి దేశంలో నూతన పొలరైజేశన్ తీసుకువచ్చిందని... ఇది దేశానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసారు. బిజెపి నాయకులు నేషనలిజానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు... దీని నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కేశవరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ (telangana bhavan) లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (republic day celebrations) జరిగాయి. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని (national flag) ఆవిష్కరించిన కేశవరావు దేశ ప్రజలందరికీ టీఆర్ఎస పార్టీ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ... గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో దేశాలు తిరిగి మేధావులు, పెద్దలు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. లౌకికవాదం, సమానత్వం, సమసమాజ నిర్మాణం గణతంత్రం యొక్క ముఖ్య ఉదేశ్యం అని తెలిపారు.
''తెలంగాణలో గత 7సంవత్సరాలుగా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి మన కళ్ళముందు కనబడుతుంది. ప్రజలు కోరుకుంటున్నవి సాకారం అవుతున్నాయి'' అన్నారు.
''మిషన్ భగీరథ (mission bhagiratha) ద్వారా తాగడానికి నీళ్లు అందించాం. దీని ఫలితంగానే ఆదిలాబాద్ లో తాగునీటి ఇబ్బందులు తొలగి విషజ్వరాలు తగ్గాయి. ఇప్పుడు ఆ జిల్లాలో విషజ్వరాల సమస్యే లేదు. జాతి పిత మహాత్మా గాంధీ (mahatma gandhi) ప్రతి మనిషికి నీళ్లు, ఆహారం అత్యవసరం... వాటిని అందించడం పాలకుల బాధ్యత అన్నారు. ఆ మాటలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది'' అని కేశవరావు పేర్కొన్నారు.
''కాలేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project) ద్వారా తెలంగాణలో కోటి ఏకరాలకు పైగా భూములకు సాగునీళ్లు ఇస్తున్నాము. రూపాయి కిలో బియ్యం అందిస్తున్నాం. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుచేయగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నాము'' అని పేర్కొన్నారు.
''మనమంతా కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసుకోవాలి. మన ఆలోచనలు, నిర్ణయాలు ఐక్యంగా ఉండాలి. దేశంలో భిన్న భాషలు, విబిన్న జాతులు ఉన్నపటికీ ఐక్యత సాదించాము. ఇకపైనా ఇలాగే ఐక్యమత్యంగా వుండాలి. ఇదే నా గణతంత్ర దినోత్సవ సందేశం'' అని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తెలిపారు.
తెలంగాణ భవన్ లో జరిగిన ఈ గణతంత్ర వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండి రమేష్, లింగంపల్లి కిషన్ రావు, కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.