బర్తరఫ్: ఉదయం 11 గంటలకు ఈటెల మీడియా సమావేశం, సర్వత్రా ఆసక్తి
మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటెల రాజేందర్ ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటెల రాజేందర్ ఈ రోజు (సోమవారం) ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆయన మీడియా సమావేశంపై సర్వత్ర ఆసక్తి రేకెత్తుతోంది. ఆయన మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే ఆసక్తి అది. తనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాట్లాడే విషయాలపై ఉత్కంఠ చోటు చేసుకుంది.
ఆదివారం రాత్రి ఈటెల రాజేందర్ శామీర్ పేటలోని తన నివాసంలో ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో బర్తరఫ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో మంతనాలు జరిపినట్లు తెలు్సతోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఈ రోజు స్పష్టత ఇవ్వవచ్చునని అంటున్నారు.
ఈటెల రాజేందర్ ఇతర మంత్రులపై వచ్చిన ఆరోపణలపై ధ్వజమెత్తుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రమైన భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఈటెల రాజేందర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ను ఈటెల రాజేందర్ కావాలనే ఆహ్వానించినట్లు అర్థమవుతోంది. ఈటెలపై భూకబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ దానిపై వెంటనే విచారణకు ఆదేశించడం, ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాకను తీసేసుకోవడం, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ స్థితిలో టీఆర్ఎస్ లో కొనసాగడం కూడా ఈటెల రాజేందర్ కు అంత సులభం కాకపోవచ్చు. ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారా, లేదా అనేది కూడా ఆసక్తి కలుగుతోంది. పార్టీ నుంచి కూడా ఉద్వాసనను కోరుకుంటారా అనేది వేచి చూడాల్సిందే
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై, నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉన్న సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ మీద చర్యలు తీసుకుంటూ వచ్చారు.