తెలంగాణ సీఎం  కేసీఆర్ మీద ఉద్వాసనకు గురైన మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కోర్టు తేలిస్తే భూముల విషయంలో శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని ఆయన అన్నారు.

హైదరాబాద్: తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరుపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తనపై జరుగుతున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. విచారణ తీరుపై కోర్టుకు వెళ్తానని, కోర్టు శిక్ష వేస్తే అనుభవిస్తానని ఆయన చెప్పారు. అసైన్డ్ భూములను కొని ఉంటే శిక్షార్హుడినే అని ఆయన అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులకు, అరెస్టులకు భయపడేంతటి చిన్నవాడు కాదు రాజేందర్ అని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలంయలోకి మారువేషంలో 5 వేల మంది పోలీసుల పహారా మధ్య వెళ్లానని, సాంబశివుడు హత్య జరిగినప్పుడు తాను వెళ్తే నయీమ్ చంపేస్తానని బెదిరించాడని, తాను భయపడలేదని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా తాను భయపడలేదని ఆయన అన్నారు. వైఎస్ సుప్రభాత సేవలకు ఎంత మంది వెళ్లారని ఆయన అడిగారు. తుర్క యంజాల్ భూముల విషయంపై తాను వైఎస్ తో వెళ్లానని చెప్పారు. తాను చెప్పడంతో దివాన్ కమిటీని వేశారని ఆయన చెప్పారు. 

పోలీసులతో భయానక వాతావరణం కల్పించి తాను లేకుండా ఎలా సర్వే చేస్తారని ఆయన అడిగారు. రాజ్యం మీ చేతుల్లో ఉండొచ్చు అధికారులు మీరు చెప్పినట్లు చెయవచ్చు, కానీ ధర్మం అనేది.. చట్టం అనేది.. ఒక్కటి ఉంటుందని ఆయన అన్నారు. ఓ మామూలు మనిషిని అయిన తనపై అన్ని రకాల శక్తులను కెసిఆర్ ప్రయోగించారని ఆయన అన్నారు. పథకం ప్రకారం కుట్ర చేశారని ఆయన అన్నారు. 

ఉద్యమ సమయంలో ప్రలోభాలకు లొంగలేదని ఆయన అన్నారు. కేసీఆర్ తో కలిసి నడవడం ప్రారంభించిన తర్వాత ఒక్క పైసా వ్యాపారం కూడా చేయలేదని ఆయన అన్నారు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తానని ఆయన అన్నారు. సీఎంగా ఉండి చట్ట ప్రకారం కేసీఆర్ వ్యవహరించాలని ఆయన అన్నారు. 

జైలుకు, పంపిస్తే వెళ్తానని ఆయన చెప్పారు. వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చానని ఆయన అన్నారు. సుదీర్ఘ కాలం టీఆర్ఎస్ లో పనిచేశానని, కేసీఆర్ తో నడిచానని, ఉద్యమకారుడిగా, మంత్రిగా, పార్టీకి గానీ ప్రభుత్వానికి గానీ కేసీఆర్ కు గానీ మచ్చ తెచ్చె పని ఒక్కటి కూడా చేయలేదని ఆయన చెప్పారు. అవినీతిరహిత నేతగా పేరు తెచ్చుకున్నానని ఆయన చెప్పారు,