Asianet News TeluguAsianet News Telugu

రికార్డ్ స్థాయిలో వేములవాడ రాజన్న హుండీ ఆదాయం...

వేముల వాడ రాజన్న దేవాలయం మరో రికార్డ్ సాధించినట్లయ్యింది. ఇప్పటివరకు ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో హుండీ ఆదాయాన్ని సొంతం చేసుకుని రికార్డ్ సాధించింది. మేడారం సీజన్ కావడంతో.. జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి రావడంతో..

record level income at vemulawada rajanna hundi
Author
Hyderabad, First Published Feb 10, 2022, 8:23 AM IST

వేములవాడ : Medaram జాతర సీజన్ తో vemulawada రాజన్న hundiకి రికార్డ్ స్థాయలో కేవలం 12 రోజుల్లో 3 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. గత నెల 27వ తేది నుండి భక్తులు స్వామి వారికి సమర్పించిన ఆదాయాన్ని లెక్కింపు ప్రక్రియ ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో రెండు రోజులపాటు కొనసాగించారు.

మంగళవారం నాటికి 2 కోట్ల 15 లక్షల రూపాయల హుండీ ఆదాయాన్ని లెక్కించిన అధికారులకు... బుధవారం మరో 92 లక్షల 92 వేల 366 రూపాయల నగదు రూపంలో సమకూరింది. దీంతో రాజన్న హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 రోజుల్లోనే 3 కోట్లకు పైగా ఆదాయం లభించడంతో రికార్డ్ సాధించినట్లయ్యింది. ఇక భక్తులు నగదుతో పాటు 289 గ్రాముల బంగారాన్ని, 12 కిలోల 944 గ్రాముల వెండిని కానుకల రూపంలో రాజన్నకు సమర్పించుకున్నారు.

కాగా, సకల సౌభాగ్యాలను ప్రసాదించే వన దేవతలు సమ్మక్క,  సారలమ్మ మహా జాతర అతికొద్ది రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ ఏడాది  ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం, 19న అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. కోరిన వరాలు ఇచ్చే వనదేవతల మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలు కడుతుంటారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తాడ్వాయి మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహిస్తారు 2022 లో జరిగే మేడారం మహా జాతర సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణం పూజారుల సంఘం ప్రకటించింది.  విగ్రహాలు లేని అతిపెద్ద జాతర మేడారం జాతర. భారతదేశంలోని అతి పెద్ద గిరిజన జాతరగా  గుర్తింపు పొందిన  ఈ ఉత్సవంలో  గిరిజనుల ఆచారాలను సంప్రదాయాలను ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిబింబిస్తుంది.  దేశం నలుమూలలనుండి  కోట్లాదిమంది జనం తరలివస్తారు.

ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే  ఈ మహా జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొదలయ్యే నాలుగు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత కోట్ల జనం తరలి వచ్చే ఏకైక జాతర మేడారంగా  గుర్తించబడింది. 

అందుకే భక్త జనాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేస్తోంది. ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసారు. కాగా కరోనా  విజృంభిస్తున్నవేళ రాష్ట్రప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. జాతరకు కావాల్సిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసే పనిలో పడింది. కాగా ఆ జాతరకు ఇప్పటికే రూ.75 కోట్లను కేటాయించినట్టుగా తెలంగాణ రాష్ట్ర మంతి సత్యవతి రాథోడ్ తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించే రావాలని ఆమె సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios