తుమ్మలతో రమేష్ రాథోడ్ భేటీ: టీఆర్ఎస్కు షాకిస్తారా?
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు ఖానాపూర్ టిక్కెట్టు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఖానాపూర్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్కే టిక్కెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు ఖానాపూర్ టిక్కెట్టు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఖానాపూర్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్కే టిక్కెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వర్ రావుతో రమేష్ రాథోడ్ శుక్రవారం నాడు సమావేశమయ్యారు.
గత ఏడాదిలో టీడీపీకి రమేష్ రాథోడ్ గుడ్ బై చెప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న రమేష్ రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుండి రమేష్ రాథోడ్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
2014 తర్వాత టీడీపీ నుండి టీఆర్ఎస్లో చేరాలని కేటీఆర్ సహా పలువురు నేతలు రమేష్ రాథోడ్ ను కోరినా కూడ ఆయన పార్టీ మారలేదు. గత ఏడాది తన కొడుకు వివాహాం సందర్భంగా ఆహ్వాన పత్రికను మంత్రి తుమ్మలకు ఇచ్చేందుకు రమేష్ రాథోడ్ ఆయనను కలిశారు.
ఈ సమయంలోనే రమేష్ రాథోడ్ ను టీఆర్ఎస్ లో చేరేలా తుమ్మల ఒప్పించారని సమాచారం. రమేష్ రాథోడ్ ను కేసీఆర్ తో సమావేశమై పార్టీలో చేరేందుకు ఒప్పుకొన్నారు. దీంతో 2017 మే 29వ తేదీన రమేష్ రాథోడ్ టీడీపీకి గుడ్ బై చెప్పారు.
ఊట్నూర్ లేదా ఖానాపూర్ టిక్కెట్టు కావాలని రమేష్ రాథోడ్ కోరారు. కానీ, ఖానాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కే టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ లో చేరిన తర్వాత రమేష్ రాథోడ్, రేఖా నాయక్ వర్గాల మధ్య పలు దఫాలు గొడవలు కూడ చోటు చేసుకొన్నాయి.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తనకు టిక్కెట్టు దక్కకపోవడంపై రమేష్ రాథోడ్ తీవ్ర ఆగ్రహాంగా ఉన్నారు. శుక్రవారం నాడు ఆయన తుమ్మల నాగేశ్వర రావు తో సమావేశమయ్యారు. టిక్కెట్టు కేటాయించకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.