తెలంగాణలో భారీ వర్షాలు: స్థంభించిన జనజీవనం, ఆరుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఆరుగురు మరణించారు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షంతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి వరద నీరు పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా భారీ వర్షాల కారణంగా లోతట్టుె ప్రాంతాలు జలమయ్యాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాగులు, వంకలు, చెరువులు అలుగు పోస్తుండడంతో చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు.
వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై వరంగల్-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్ చెరువు వద్ద వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు వాగు, ఆలేరు వాగు ఉధృతంగా ప్రశహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పొలంపేటలో రామప్ప తూర్పు రోడ్డుకు గండిపడింది. కరీంనగర్, వరంగల్ నగరాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ లోని హంటర్ రోర్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, సాయి నగర్ తో పాటు 10 కాలనీలు నీటిలోనే ఉన్నాయి.
కరీంనగర్ లో 15 కాలనీల్లో వరద నీరు చేరింది.సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను వరద ముంచెత్తింది. కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంటతో పాటు నిజామాబాద్ జిల్లాలోని పలు కాలనీలు వరదలోనే ఉన్నాయి.
నిర్మల్ లోని పలు కాలనీల్లో వరద ముంచెత్తింది. వినాయకనగర్, రాహుల్ నగర్, గోవింద్ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది.కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మహ్మద్నగర్ మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోయింది. కరీంనగర్ మండంలో ఎలబోతారం, ముగ్థుంపూర్ చెక్ డ్యామ్ ల కట్టలు తెగిపోయాయి.నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మంలం చింతలూరులోని కోళ్ల ఫారంలో 5 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు నది ప్రవాహంతో ఏడుపాయల ఏడుపాయల దుర్గాభవాని ఆలయాన్ని మూసివేశారు. ఆలయం చుట్టూ నది ప్రవాహం ముంచెత్తింది.