తప్పిన ప్రమాదం: ఫలక్నుమాలో రైల్వేట్రాక్ కింద కుంగిన భూమి
హైద్రాబాద్ పాతబస్తీలో రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది. రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలో రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది. రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
భారీ వర్షాలకు ఫలక్నుమా రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ట్రాక్ పై సుమారు ఐదు ప్రాంతాల్లో ఇదే తరహాలో భూమి కుంగిపోయింది. ఇదే ట్రాక్ పై మరో ఐదు నిమిషాల్లో గూడ్స్ రైలు వెళ్లేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన గార్డు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైళ్ల రాకపోకలను మళ్లించారు.
ఈ ట్రాక్ పై గొయ్యి ఏర్పడిన సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు నడవలేదు. ఒకవేళ ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు సాగితే ప్రమాదం జరిగేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 8 మీటర్ల వెడల్పుతో భూమి కుంగిపోయింది. ట్రాక్ కింద భూమి కుంగిన ప్రాంతం నుండి నీళ్లు వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో అధికారులు గొయ్యి వద్ద మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఏయే ప్రాంతాల్లో భూమి కుంగిపోయిందా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల వల్లే భూమి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు.