పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిస్తాం: రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో సమూల మార్పులు చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు. చిన్న, మధ్యతరహా సంస్థలు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని రాహుల్ చెప్పారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో సమూల మార్పులు చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు. చిన్న, మధ్యతరహా సంస్థలు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని రాహుల్ చెప్పారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా హైద్రాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైన కార్యక్రమాలను అమలు చేయనున్నామో రాహుల్ గాంధీ వివరించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 మందికి పైగా యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, దగ్గుబాటి సురేష్ బాబు, ఏపీకి చెందిన టీడీపీ నేత టీజీ భరత్ కూడ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూల మార్పులతో పాటు ఒకే శ్లాబ్ విధానాన్ని తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారు. పారిశ్రామిక విధానాలు, తెలుగు రాష్ట్రాల వృద్దిరేటు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై రాహుల్ చర్చించారు.
జీఎస్టీ అమల్లో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఈ లోపాల కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయని విమర్శించారు. . పెద్ద నోట్ల రద్దు అనేది ఎవరికి ప్రయోజనం చేకూర్చిందో అంతుపట్టడం లేదన్నారు.
సులభతర వ్యాపార నిర్వహణ, ప్రోత్సాహకాలు లాంటివి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సరళీకృత విధానాలను తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారాలు చూపుతామని రాహుల్ హామీ ఇచ్చారు.