గన్నవరం ఎయిర్ పోర్టుకు  రాహుల్ గాంధీ  చేరుకున్నారు.  ప్రత్యేక హెలికాప్టర్ లో  రాహుల్ గాంధీ  ఖమ్మానికి చేరుకుంటారు.

గన్నవరం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం సభకు రాహుల్ గాంధీ బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి ఏపీ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించారు. భట్టి విక్రమార్క 109 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పాదయాత్రను మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. మూడు మాసాల తర్వాత భట్టి విక్రమార్క ఖమ్మం పట్టణంలోకి పాదయాత్ర చేరుకుంది. 

also read:శ్రీశ్రీ సెంటర్ నుండి సభకు భట్టి పాదయాత్ర: సీఎల్పీ నేతను సన్మానించనున్న రాహుల్

సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్కను ఖమ్మం సభా వేదికపై రాహుల్ గాంధీ సన్మానించనున్నారు. మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడ రాహుల్ గాంధీ సన్మానిస్తారు. 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం సభ నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందనే విషయాన్ని ప్రకటించనుంది.మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.తన అనుచరులతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. 

రానున్న ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలోకి ఖమ్మం జిల్లా నుండి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అడుగుపెట్టనీయబోమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి రాజకీయంగా కలిసి రానుందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.