కేసీఆర్ కి కూడా అదేగతి పడుతుందని హెచ్చరిస్తున్న కృష్ణయ్య
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ కేంద్రంలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మోదీపై ఒత్తిడి తెస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆ భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే.. గతంలో ముందస్తు ఎన్నికలు వెళ్లినవారు ఎవ్వరూ గెలిచింది లేదని.. కేసీఆర్ కి కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.
బీసీలను అణచివేసేందుకే క్రిమీ లేయర్ను తెచ్చారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ కేంద్రంలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మిజోరాం) తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మోదీపై ఒత్తిడి తెస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజలు తమను ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారని, టీఆర్ఎస్ అనేక వాగ్దానాలు చేసిందని కృష్ణయ్య అన్నారు. ఇంటికో ఉద్యోగమని, పేదలందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పిందని, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని, ఇలా వాగ్దానాలు వాగ్దానాలు చేసిందని ఆయన అన్నారు. ఈ వాగ్దానాలు నెరవేర్చకుండానే మళ్లీ ఎన్నికలకు పోయి... ఐదేళ్లు సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీటీడీపీ, ఆర్. కృష్ణయ్య సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.