పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్..సీఐ సస్పెండ్.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుపై కేసు
పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో మలుపు తిరిగింది. సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ పేరును ఏ1 ముద్దాయిగా చేర్చారు.
![punjagutta rash driving case, ex mla shakeel son sohail named A1, CI durgarao suspended kms punjagutta rash driving case, ex mla shakeel son sohail named A1, CI durgarao suspended kms](https://static-ai.asianetnews.com/images/01hjkzpqy2k7z9vk6xt8wm20yv/ci-durgarao-png_363x203xt.jpg)
Rash Driving: ఈ నెల 24వ తేదీన రాత్రిపూట పంజాగుట్ట వద్ద జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నుంచి బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇదే దిశగా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా షకీల్ కొడుకు సోహైల్ పేరును చేర్చారు.
ఈ రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. ఈ కేసులో షకీల్ కొడుకు సోహైల్ను అరెస్టు చేయకుండా షకీల్ ఇంట్లో డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సొహైల్పై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ప్రమాదం జరిగినప్పుడు కారును సోహైల్ నడుపుతున్నట్టుగా కనిపించాడు. దీంతో సీఐ తన బాధ్యతల్లో అలక్ష్యంగా వ్యవహరించాడని అధికారులు ఫైర్ అయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. బీపీ పడిపోవడంతో ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : BRS: మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు
ఈ నెల 24వ తేదీన అర్థరాత్రి పూట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సొహైల్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. పోలీసులు కారును ఆపి అందులో డ్రైవింగ్ చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని స్టేషణ్కు వెళ్లారు. అయితే.. షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో షకీల్ కొడుకు సోహైల్ పేరు లేదు. సోహైల్ పేరుకు బదులు వారి వద్ద డ్రైవర్గా ఉన్న వ్యక్తి పేరును చేర్చారు. డ్రైవర్ నిందితుడగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపడంతో డీటెయిల్గా కేసు దర్యాప్తు చేసి నివేదిక అందించాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులను అడిగాడు. దీంతో పోలీసుల నిర్వాకం బయటపడింది. సీఐ దుర్గారావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. దీంతో ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, కేసులో ఏ1 ముద్దాయిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ పేరును చేర్చారు.