మహిళను వేధిస్తున్న టీఆర్ఎస్  నేతను చితకబాదారు మహిళలు. కోరుట్ల మండలం కల్లూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇటీవల జరిగిన పలు కేసులకు టీఆర్ఎస్ నేతలు కేంద్ర బిందువుగా మారడంతో తాజా ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కోరుట్ల (korutla) మండలం కల్లూర్‌లో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్‌ను చితకబాదారు మహిళలు. తన భార్యను లైంగికంగా వేదిస్తున్నాడని, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని అంజయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక మహిళలు.. గంగాధర్ గౌడ్‌ ఇంటికి వెళ్లి అతనిని బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. 

కాగా.. తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. రామాయంపేటకు (ramayampet) చెందిన తల్లీకొడుకు ఆత్మహత్య, ఖమ్మంలో (khammam) బీజేపీ (bjp) కార్యకర్త ఆత్మహత్య.. ఈ రెండు ఘటనల్లో టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మహిళపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడంతో.. కూకట్‌పల్లి టీఆర్ఎస్ కో-ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుసగా టీఆర్‌ఎస్ నాయకులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడంతో.. పార్టీ అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి. మరోవైపు ఈ ఘటనలపై ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు తప్పులు చేస్తే.. సీఎం కేసీఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

రామాయంపేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ (santosh) ఆత్మహత్య చేసుకోవడానికి ముందు టీఆర్ఎస్ నాయకుల నుంచి తాము వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా ఆరోపించారు. వారి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌‌తో సహా మొత్తం ఏడుగురు తమ ఆత్మహత్యకు కారణమని వారు చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అఖిలపక్ష నేతలు రామాయంపేట బంద్ కూడా నిర్వహించాయి. బాధిత కుటంబాన్ని ప్రతిపక్ష పార్టీలు పరామర్శించాయి. నిందితులు అధికార పార్టీకి చెందినవారు కావడంతోనే పోలీసులు విచారణ సరైన రీతిలో జరపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) .. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎష్ నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.