సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేష్ అంతిమయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్న కొందరు వరంగల్ రైల్వే స్టేషన్పై దాడికి యత్నించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేష్ అంతిమయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్ ఎంజీఎం నుంచి మొదలైన రాకేష్ అంతిమయాత్ర.. అతని స్వగ్రామం డబీర్పేట సాగనుంది. అయితే అంతిమయాత్రలో కొన్నిచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందననే టెన్షన్ నెలకొంది. తొలుత రాకేష్ అంతిమయాత్ర సాగుతున్న మార్గంలోని పోచం మైదాన్ కూడలిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై కొందరు రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలకు నిప్పు పెట్టేందుకు యత్నించగా పోలీసులు వారిని నివారించారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు రాకేష్ అంతిమ యాత్ర ముందుకు సాగగా.. వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ వైపు దూసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. రాకేష్ మృతదేహాన్ని కూడా అటువైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వేస్టేషన్ ముందు కొందరు టైర్లు కాల్చి ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇక, రాకేష్ అంతిమయాత్ర మొత్తం టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలోనే సాగుతుంది. . అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాఠోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక, రాకేష్ అంత్యక్రియలు నేడు అతని స్వగ్రామంలో నిర్వహించనున్నారు.
మరోవైపు రాకేష్ మృతికి నిరసనగా ఈ రోజు నర్సంపేట నియోజకవర్గ బంద్కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక, రాకేశ్ మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్ నివాళులు అర్పించారు.
ఇక, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (secunderabad railway station) వద్ద జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేశ్గా గుర్తించారు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ప్రస్తుతం రాకేష్ సోదరి సైన్యంలోనే పనిచేస్తున్నారు. రాకేశ్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని పరితపించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో పాల్గొనడానికే హైదరాబాద్కు వచ్చాడని తెలిపారు.
