డబుల్ బెడ్రూం ఇంటి కోసం భర్త సెల్ టవర్ ఎక్కగా అతడికి మద్దతుగా భార్యా, కుటుంబసభ్యులు రోడ్డుపై భైఠాయించారు.  

నల్గొండ: డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కలేదని మనస్థాపంతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అతడికి మద్దతుగా భార్యా, కుటుంబసభ్యులు కూడా రోడ్డుపై భైఠాయించారు. ఇలా ఓ కుటుంబం మొత్తం డబుల్ బెడ్రూం ఇంటి కోసం రోడ్డెక్కారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల మల్లేష్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇళ్లు తక్కువగా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు ఎక్కువగా వుండటంతో లక్కీ డ్రా ద్వారా కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే డబుల్ ఇంటిపై ఎన్నోఆశలు పెంచుకున్న మల్లేష్ కు అద్రుష్టం వరించలేదు. లక్కీ డ్రాలో అతడి పేరు రాకపోవడంతో ఇళ్లు కేటాయింపు జరగలేదు. 

read more cyber crime:అమ్మాయిల మాయమాటలతో మస్కా... లక్షల్లో దోచేస్తున్న కేటుగాళ్లు

దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుటగల సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తనకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించే వరకు సెల్ టవర్ దిగబోనని బీష్మించుకు కూర్చున్నాడు. మల్లేశ్‌కు మద్దతుగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు.

ఈ నిరసనలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ ను కిందకుదించే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో గ్రామ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా వచ్చే విడతలో ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులను అధికారులు తెలపడంతో వారు మల్లేష్ కు నచ్చజెప్పి సెల్ టవర్ దిగేందుకు ఒప్పించారు.