కరోనా ఎఫెక్ట్: ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
నల్గొండ: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
కరోనా కారణంగా ఏడాది నుండి జీతాలు రాకపోవడంతో ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకొంటున్నాయి. రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భార్య ఇల్లు వదిలివెళ్లిపోయింది. దీంతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుడిని రవిగా గుర్తించారు. ఆయన సాగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు.
ఇటీవలనే ఒక్క నెల రోజుల పాటు స్కూల్స్ తిరిగి తెరిచారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి విద్యా సంస్థలను తిరిగి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్దికంగా చితికిపోయారు. మృతుడికి ఇద్దరు పిల్లలు.