సుప్రీం ఆదేశాలు పాటించాల్సిందే: ప్రైవేట్ స్కూల్స్కి తెలంగాణ హైకోర్టు ఆదేశం
ప్రైవేట్ స్కూల్స్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరేంట్స్ ఫోరం అప్పీల్ పై మంగళవారంనాడు హైకోర్టు విచారించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ఫీజులు చెల్లించని 219 మంది విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతుల బోధించడం లేదన్న పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఫీజులో ఎంత శాతం తగ్గించారో చెప్పాలన్న హైకోర్టు స్కూల్ యాజమాన్యాన్ని కోరింది.
ఫీజు చెల్లించలేదని ఆన్ లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్ లైన్ క్లాసులు నిలిపివేస్తే పిల్లల చదువుకొనే హక్కును కాలరాసినట్టేనని హైకోర్టు అభిప్రాయపడింది. లాభాపేక్షలేని సోసైటీ కూడ కార్పోరేట్ సంస్థల వ్యవహరిస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.ఫీజులతో ముడిపెట్టకుండా ఆన్ లైన్ లోనే బోధన కొనసాగించాలని కోరింది.ఎంతమంది ఫీజులు చెల్లించారో కూడా ప్రకటించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.