దారుణం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ.. వైరల్
ఆయన చనిపోయారని ఓవైపు అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే.. ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం మృతదేహంతో సెల్ఫీ దిగారు. అది కూడా నవ్వుకుంటూ ఫోటోకి ఫోజ్ ఇచ్చి మరీ దిగారు.
సినీనటుడు,మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి నందమూరి అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరులో స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన వారిని అక్కడికి దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. అయితే.. ఆ ప్రైవేటు ఆస్పత్రిలో సిబ్బంది చేసిన ఓ నిర్వాకం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆయన చనిపోయారని ఓవైపు అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే.. ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం మృతదేహంతో సెల్ఫీ దిగారు. అది కూడా నవ్వుకుంటూ ఫోటోకి ఫోజ్ ఇచ్చి మరీ దిగారు.
ఆ ఫోటోని ఓ వ్యక్తి వారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది. సెలబ్రెటీ అయితే చాలు.. మృతదేహం అయినా పర్వాలేదా అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మానవ విలువలు తగ్గిపోయాయి అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులను మాత్రం నోటికి వచ్చిన విధంగా దూషిస్తున్నారు.