ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ బిజెపిలో మరింత జోష్ పెంచింది. తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య విబేదాలున్నాయన్న వార్తలకు ప్రధాని పర్యటన క్లారిటీ ఇచ్చింది.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పర్యటన రాజకీయపరమైనది కాకున్నా తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఇప్పటికే కేంద్రంలోని బిజెపి (bjp) ప్రభుత్వం, పీఎం మోదీపై మాటలయుద్దం మొదలుపెట్టిన సీఎం కేసీఆర్ (KCR) చివరకు ఆయనను స్వాగతించేందుకు కూడా రాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో తెలంగాణ బిజెపి (Telangana BJP)లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయన్న ప్రచారానికి కూడా ప్రధాని పర్యటన తెరపడేలా చేసింది. 

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో శనివారం రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ వ్యవసాయం పరిశోధన సంస్థ ఈక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో భాగంగ పటాన్ చెరులోని ఆ సంస్థ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ స్వామితో కలిసి శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల కోసం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు విచ్చేసిన పీఎం సాయంత్రం న్యూడిల్లీకి వెళ్లిపోయారు.

Scroll to load tweet…

అయితే ప్రధానికి స్వాగతం మరియు వీడ్కోలు పలికే సమయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలుచోటుచేసుకున్నాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించారు. దీన్నిబట్టి మాటవరసకు కూడా బిజెపితో దగ్గరగా మెలగకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు స్ఫష్టంగా అర్థమవుతుంది. 

ఇక ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో చోటుచేసుకున్న ఓ పరిణామంతో తెలంగాణ బిజెపిలో అంతర్గత విభేదాల ప్రచారానికి తెరపడింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఇటీవల టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరి హుజురాబాద్ నుండి అద్భుత విజయాన్న అందుకున్న ఈటల రాజేందర్ మధ్య విబేదాలున్నాయంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి ఈటల ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చాడని... ఆ తర్వాత కూడా కొన్ని విషయాల్లో రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయాన్ని ధిక్కరించేలా వ్యవహరించాడని... దీంతో బండి సంజయ్-ఈటల మధ్య దూరం పెరిగిందని రాజకీయ ప్రచారం ఇటీవల బాగా జరిగింది. 

అయితే అలాంటిదేమీ లేదని ప్రధాని మోదీ సమక్షంలోనే బండి సంజయ్, ఈటల స్పష్టం చేసారు. వీడ్కోలు పలికే సమయంలో ప్రధాని తమవద్దకు రాగా ఈటలను స్వయంగా సంజయే పరిచయం చేసారు. ఈటల గురించి సంజయ్ ఏదో చెప్పగా ప్రధాని భుజం తట్టాడు. ఆ తర్వాత సంజయ్ తో కూడా ఏదో మాట్లాడారు.

అయితే ప్రధాని వీరితో ఏం మాట్లాడారో ఓ బిజెపి నేత బయటపెట్టాడు. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని ఎదిరించి ఈటల హుజురాబాద్ లో విజయం సాధించాడని సంజయ్ చెప్పగా ''తుమ్ చోటా హో మగర్ బడా కామ్ కియే'' (నువ్వు చూడ్డానికి చిన్నగా వున్నావు... కానీ పెద్ద పని చేసావు) అని అభినందిస్తూ భుజం తట్టినట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. 

ఇక ఇటీవల అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలను నేపథ్యంలో ''క్యా బండి సంజయ్ జీ... సబ్ టీక్ టాక్ చల్ రహానా'' (బండి సంజయ్ గారు... అంతా సవ్యంగా జరుగుతుంది కదా} అని ప్రధాని మోదీ బండి సంజయ్ ను పలకరించినట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. 

స్వయంగా ఈటలను బండి సంజయే ప్రధానికి పరిచయం చేయడం ద్వారా వారిద్దరి మధ్య విబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఇలా ప్రధాని పర్యటన తెలంగాణ బిజెపికి సానుకూలంగా మారింది.