తెలంగాణ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ రాత్రికి ఆమె రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం రేపు ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు రాష్ట్రపతి. 

అయితే గత కొంతకాలంగా తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదటూ గవర్నర్ తమిళిసై నేరుగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా తర్వాత గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్‌లు కలుసుకోవడం ప్రధాన్యత సంతరించుకుంది.