కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడు.. విజన్ ఉన్న వ్యక్తి: సినీ నటుడు ప్రకాష్ రాజ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న వ్యక్తి అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడని కొనియాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న వ్యక్తి అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడని కొనియాడారు. కరీంనగర్ కళోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాలలో మంత్రి గంగుల కమలాకర్, ప్రకాష్ రాజ్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ.. తదితరులు పాల్గొన్నారు. కళోత్సవంలో కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్తో కలిసి.. పలువురు కళాకారులను ప్రకాష్ రాజు సన్మానించారు. కళాకారులతో కలిసి స్టెప్స్ కూడా వేశారు.
ఈ వేదికపై నుంచి ప్రకాష్ రాజు మాట్లాడుతూ.. తాను కరీంనగర్ రావడం మొదటిసారి అని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ భాషను, యాసను చులకనగా చూసేవారని అన్నారు. సినిమాల్లో కామెడీకి మాత్రమే వాడేవరని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ భాష అందరికీ తెలుస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశం గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం అదృష్టమని చెప్పారు.
మతోన్మాదులు ఎంతోమంది అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నా.. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని.. దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణను మార్చారని ప్రకాష్ రాజ్ ప్రశంసించారు. తెలంగాణలో అద్భుతమైన కళాకారులు ఉన్నారని అన్నారు.
ఇక, కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులతో ప్రకాష్ రాజ్కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేసిన సమయంలో ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కర్ణాటక, మహారాష్ట్రలకు కేసీఆర్ వెళ్లిన సమయంలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించిన సంగతి తెలిసిందే.