టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’ విజయవంతం అయినప్పటికీ...కార్యకర్తల కారణంగా టీఆర్ఎస్ అప్రతిష్ట మూటకట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’ విజయవంతం అయినప్పటికీ...కార్యకర్తల కారణంగా టీఆర్ఎస్ అప్రతిష్ట మూటకట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సభ స్థలికి చేరుకునే ముందే కార్యకర్తలు ఫుల్లుగా చుక్కేసి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీఆర్ఎస్ నేతలే దగ్గరుండి కార్యకర్తలకు మద్యాన్ని పంచుతుండటం.. వాళ్ల చేతుల్లోని గులాబీ కండువాలు సదరు వీడియోల్లో కనిపిస్తుండటంతో గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఎప్పుడైతే ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయో.. ప్రతిపక్షపార్టీలు టీఆర్ఎస్‌పై దాడికి దిగారు.

ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం తాగుతున్నందుకు కేంద్రంగా మారినందుకు మద్యం తాగడానికి ఆర్టీసీ అధికారులు నిజంగా సిగ్గుపడాలి. ఇది బంగారు తెలంగాణ కాదు... తాగుబోతుల తెలంగాణ.. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ... సభకు హాజరైన కొందరి చేతుల్లో మద్యం బాటిళ్లు కనిపించాయని.. అలాగే ఒక మేకను చంపి దాని మాంసాన్ని వండటానికి సిద్ధం చేసినట్లుగా కొన్ని ఫోటోల్లో కనిపించాయన్నారు.

బస్సు మీద మద్యం తాగుతూ సభకు వెళ్లి.. మీ కార్యకర్తల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీలు ప్రజలకు తమ బలం ఎంత ఉందో చూపించడానికి ఇలాంటి సభలను పెడతాయని.. కొందరు కార్యకర్తలు డబ్బు కోసం ఇటువంటి సభలకు వస్తారని... అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ముందు మందు, బిర్యానీ తర్వాత డబ్బులు అడుగుతారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక వేదిక వద్దకు చాలా మంది బైకుల మీద ర్యాలీగా చేరుకున్నారు. వీరిలో ఎవ్వరూ హెల్మెట్ పెట్టుకోలేదు. దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వమంటారు.. అలాగే బస్సుల పైకి ఎక్కిన తమవారిని చూపించి ప్రజలకు ఎలాంటి భద్రతాపరమైన సూచనలు ఇస్తారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.