సైదిరెడ్డి ట్వీట్: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. తమిళిసైకి మద్ధతుగా బీజేపీ, కాంగ్రెస్
తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించాయి.
తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కించాయి. గవర్నర్ వ్యాఖ్యలు పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు కామెంట్లు ఇప్పుడు హట్ టాపిక్గా మారాయి.
ఈ క్రమంలో బీజేపీ నేతలు స్పందించారు. గవర్నర్కు పోలిటికల్ మోటివ్ ఉండుంటే తెలంగాణలో ఈపాటికి రాష్ట్రపతి పాలన వచ్చి వుండేదని కమలానాథులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కరోనాను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. ఫార్మా, మెడికల్ హాబ్గా ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోలేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ విజృంభణపై ఆరు, ఏడు లేఖలు రాశానని, మూడు నాలుగు నెలల క్రితమే హెచ్చరించానని తమిళిసై తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాంధీ ఆసుపత్రి ఒక్కటే దిక్కైందన్నారు. పరీక్షల పెంపు, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్సలపైనా సూచించినట్లుగా చెప్పారు. వైద్య సిబ్బంది నియామకం, పడకల సంఖ్య పెంచాలని చెప్పానని గుర్తుచేశారు.
Also Read:కేసీఆర్ కు చిక్కులు: ప్రతిపక్షాలకు గవర్నర్ తమిళిసై అస్త్రం
80 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచి రాగా.. అందులో మన రాష్ట్రం కూడా వుందని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గవర్నర్ బీజేపీ నేతంటూ హూజుర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన ట్వీట్తో రాష్ట్రంలో వివాదం రాజుకుంది.
దీనిపై బీజేపీ నేతలు ఫైరయ్యారు.. సైదిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యాఖ్యలు తెలంగాణ పరిస్ధితికి అద్దం పడుతున్నాయని కమలనాథులు తెలిపారు.
తెలంగాణలో కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. గవర్నర్పై ఎదురుదాడికి దిగడం ప్రజాస్వామ్యానికి చేటని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ప్రజల బాధలు ప్రస్తావించి గవర్నర్ ప్రభుత్వం కళ్లు తెరిపించారని చెప్పారు.
గవర్నర్పై టీఆర్ఎస్ నేల వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కేంద్రానికి నివేదికివ్వాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు.