Asianet News TeluguAsianet News Telugu

దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు సీఎల్పీ టీమ్: అడ్దుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయింపు

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ బృందాన్ని మంగళవారం నాడు పోలీసులు అడ్డుకున్నారు.  భద్రతా కారణాలతో తమను పోలీసులు అడ్డుకోవడాన్ని సీఎల్పీ బృందం తప్పుబట్టింది. ప్రాజెక్ట్ సందర్భనకు అనుమతివ్వాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 

Police Stopped CLP team in Bhadrachalam
Author
Hyderabad, First Published Aug 16, 2022, 3:24 PM IST

ఖమ్మం: దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద  సీఎల్పీ బృందాన్ని మంగళవారం నాడు  పోలీసులు  భద్రాచలం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో సీఎల్పీ బృందం వాగ్వాదానికి దిగింది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  పోలీసులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు,పోలీసుల  మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటు చేసుకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రాజెక్టు పరిశీలనకు అనుమతివ్వాలని సీఎల్పీ బృందం పోలీసు ఉన్నతాధికారులతో పోన్ చేసి మాట్లాడారు.మావోయిస్టు  ప్రాబల్యం ఉన్న ప్రాంతమైనందున దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లొద్దని సీఎల్పీ బృందానికి పోలీసులు అడ్డు చెప్పారు.  భద్రతా కారణాల రీత్యా  ప్రాజెక్టు సందర్శనను అనుమతి ఇవ్వకపోవడాన్ని సీఎల్పీ బృందం తప్పు బట్టింది. సీఎల్పీ బృందం దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శించడం వల్ల అక్కడ లోపాలు బయటపడతాయనే భయం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును పరిశీలించకుండా  సీఎల్పీ టీమ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన ప్రాజెక్టులనైనా పరిశీలించేందుకు పోలీసులు అనుమతిస్తారా లేదా అనే అనుమానాలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వంగానే తమను ప్రాజెక్టును పరిశీలించకుండా అడ్డుకొంటున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. 

ఇవాళ్టి నుండి ప్రాజెక్టులను పరిశీలనకు వెళ్లాలని సీఎల్పీ నిర్ణయం తీసుకొంది. గత వారం హైద్రాబాద్ లో సమావేశమైన సీఎల్పీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. జూలై, ఆగష్టు మాసాల్లో కురిసిన వర్షాలు, భారీగా వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాలని సీఎల్పీ నిర్ణయించింది. ఇవాళ దుమ్ముగూడెం నుండి ప్రాజెక్టుల సందర్శనను సీఎల్పీ ప్రారంభించింది.

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు  కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. దీంతో  కడెం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని ఈప్రాజెక్టు కింద ఉన్న 25 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే  ఈ ప్రాజెక్టుకు చెందిన ఓ గేటు కూడా ఆ సమయంలో పని చేయలేదు.  ఈ ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని ఆ సమయంలో అనుకున్నారు. అయితే ప్రాజెక్టు కు సంబంధించిన కాలువ  దెబ్బతినడంతో వరద నీరు అటు వైపు నుండి కూడా వెళ్లిపోయింది. దీంతో ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ప్రాజెక్టు 3 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రం తట్టుకొనే సామర్ధ్యం ఉంది. అయితే  జూలై మాసంలో వచ్చిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు సుమారు 5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.   అయితే అదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టుకు ఏం కాలేదని  కేసీఆర్ కూడా ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios