టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ని పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో సంజయ్కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే
టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. అయితే సంజయ్ రిమాండ్ను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. మరోవైపు వరంగల్ పోలీసులు కూడా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం వుంది. సంజయ్ని ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుందని పోలీసులు అంటున్నారు.
అంతకుముందు మంగళవారం హైడ్రామా మధ్య బండి సంజయ్ని హన్మకొండలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు, బండి సంజయ్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్కి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 19 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులను ఖమ్మం జైలుకు తరలిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సంజయ్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఆయనతో పాటు మిగిలిన నిందితులను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అనుమతించారు. మరోవైపు మేజిస్ట్రేట్ నివాసం వద్ద బీఆర్ఎస్ , బీజేపీ శ్రేణులు భారీగా మోహరించారు. అటు రిమాండ్పై మేజిస్ట్రేట్ ఆదేశాల నేపథ్యంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ALso Read: టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్కి 14 రోజుల రిమాండ్, మరో ముగ్గురికి కూడా
కాగా.. టెన్త్ పేపర్ లీక్ కేసులో సంజయ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర పెద్దలు పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ను రేపు ఉదయం విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో బండి సంజయ్ని ఏ1 నిందితుడిగా చేర్చారు పోలీసులు.
ఇక మిగతా తొమ్మిది మంది నిందితులు వీరే....
ఏ2 బూర ప్రశాంత్
ఏ3 మహేష్
ఏ4 మైనర్ బాలుడు
ఏ5 మోతం శివగణేష్
ఏ6 పోగు సుభాష్
ఏ7 పోగు శశాంక్
ఏ8 దూలం శ్రీకాంత్
ఏ9 పెరుమాండ్ల శార్మిక్
ఏ10 పోతబోయిన వసంత్
