వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్రకు అనుమతి రద్దు..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర మహబూబాబాద్లో కొనసాగుతుంది. అయితే మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్పై షర్మిల అనుచిత వ్యాఖ్యల చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా దిగారు. షర్మిల క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పాదయాత్రను రద్దు చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసులు షర్మిలకు నోటీసులు అందజేసి.. ఆమె పాదయాత్రకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక, శంకర్ నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బీఆర్ఎస్ శ్రేణుల ఫిర్యాదుతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే, శనివారం తన పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శంకర్ నాయక్ తనపై, తన పార్టీ సభ్యులపై అవమానకరమైన చేస్తున్నారని మండిపడ్డారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. తాటాకు చప్పుళ్లకు ఈ వైఎస్సార్ బిడ్డ భయపడేది కాదని అన్నారు. ‘‘ఈ అవినీతి నాయకులను ఎలా సంబోధించాలో నాకు తెలియడం లేదు. ప్రతి విషయంలోనూ విఫలమై, ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా, అవినీతికి, భూకబ్జాలకు పాల్పడుతున్న వారిని ఏమని పిలవాలి’’ అని షర్మిల మండిపడ్డారు.
‘‘ఎవరినీ సెటిలర్లు లేదా వలసదారులు అని పిలవవద్దని నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. శంకర్ నాయక్ భార్య నెల్లూరుకు చెందినవారు. తెలంగాణపై ప్రేమ ఉంటే ఆమెకు విడాకులు ఇవ్వు. ఓ మహిళా ఐఏఎస్ అధికారితో అనుచితంగా ప్రవర్తించావు. అప్పుడే నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలి. లంచం ఆరోపణలతో నువ్వు ఉద్యోగం కోల్పోయారు. గుట్కా మాఫియా నుంచి ఇసుక మాఫియా వరకు, పీడీఎస్ బియ్యం కుంభకోణం వరకు బెల్లం కుంభకోణం వరకు ప్రతి స్కామ్లో ఉన్నావు. పేద రైతుల భూములు, గిరిజనుల భూములు లాక్కున్నారు. మీ పాపాల జాబితా అంతులేనిది. మీరు ఎమ్మెల్యే పదవికి సరిపోతారని కేసీఆర్ భావించడం సిగ్గుచేటు’’ అని షర్మిల ఫైర్ అయ్యారు.