రైతు సంఘాల చలో రాజ్భవన్.. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
రైతు సంఘాలు చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తతకు దారితీసింది. రైతు సంఘాల నాయకులకు రాజ్భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
రైతు సంఘాలు చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రైతు సంఘాలు నేడు చలో రాజ్భవన్ చేపట్టనున్నట్టుగా పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్భవన్కు బయలుదేరిన రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతు సంఘాల నాయకులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు సంఘాల నాయకులకు రాజ్భవన్ వైపు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే రైతు సంఘాల నాయకులు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నిలిబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే రైతు సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆందోళన చేపట్టిన రైతు సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇక, రైతు సంఘాల చలో రాజ్భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు రాజ్భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.