ఆలేరులో రూ.13.3 లక్షల నగదు స్వాధీనం
యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద గురువారం ఉదయం 5గంటల సమయంలో రూ.13.3లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవ్వడానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. దీంతో.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అర్థరాత్రి సమయంలో వాహనాలలో డబ్బులు తరలిస్తున్నారు. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద గురువారం ఉదయం 5గంటల సమయంలో రూ.13.3లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనంలో పోలీసులు తనిఖీలు జరపగా.. నగదు లభించింది. అందులో కప్పు సాసర్లతో కూడిన అట్టపెట్టలు ఉండగా.. పోలీసులు వాటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. కాగా.. వాటిల్లోని ఒక పెట్టెలో నగదు ఉన్నట్లు గుర్తించారు.
నగదు స్వాధీనం చేసుకొని వాహనం డ్రైవర్ ని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తొర్రూరుకి ఈ నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.