కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది.
నిర్మల్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారనే ఫిర్యాదు మేరకు మహేశ్వర్ రెడ్డిపై నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మహేశ్వర్ రెడ్డి ఈ నెల 21వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేత మారుగొండ రాము శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ నేత రాము ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా ఆయన పరువు ప్రతిష్ట దెబ్బతినేలా చేశాడని.. అందుకే మహేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు.
