దళిత మహిళా కౌన్సిలర్ పై కేసు... ఇదేనా దళిత సాధికరత?: కేసీఆర్ ను నిలదీసిన కోమటిరెడ్డి
తుర్కయాంజల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ప్రశ్నించిన దళిత మహిళా కౌన్సిలర్ పై పోలీసులు కేసు పెట్టారని... ఇదేనా దళిత సాధికారిత? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
దళిత సాధికారత అంటూనే దళితుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ వివక్ష చూపిస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం తుర్కయాంజల్ మున్సిపాలిటీలో అవినీతి ప్రశ్నించిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై కేసులు పెట్టడాన్ని, దళిత మహిళ కౌన్సిలర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మున్సిపల్ కమీషనర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎంపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... నేడు తుర్కయాంజల్ మున్సిపాలిటీకి చీకటిరోజని అన్నారు. ఏ అధికారైనా ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలను పరిష్కరించాలి... కానీ అడిగిన వారిని దూషించడం ఎంతవరకు సమంజసమన్నారు. తుర్కయాంజల్ మున్సిపల్ కమీషనర్ చేసిన అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లపై కేసులు పెట్టడం ఏంటని ఎంపీ ప్రశ్నించారు. ఓ దళిత మహిళ కౌన్సిలర్ను అసభ్యంగా దూషించడమే కాకుండా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులు పెట్టడం అమానవీయం అని మండిపడ్డారు. దళిత మహిళ కౌన్సిలర్ను దూషించిన కమీషనర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి... లేదంటే సర్కార్పై పోరాటానికి సిద్దమవుతామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.
read more హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తా.. ఉత్తమ్ కుమార్
సీఎం దళిత సాధికారత అంటూనే ఇక్కడ పల్లెలు, పట్టణాల్లో దళితులను అవమానిస్తున్నారని విమర్శించారు. వరంగల్లో మంత్రి దయాకర్ రావు మహిళ అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే నేడు అధికారులు మహిళ ప్రజా ప్రతినిధులను అవహేళన చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన అలుసుతోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు మహిళలు, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆ అవినీతిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలను వివరమించుకోకుంటే తప్పకుండా టీఆర్ఎస్ సర్కార్కు గట్టి గుణపాఠం చెబుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.