హుజూర్ నగరగ్ నుంచి పోటీ చేస్తా.. ఉత్తమ్ కుమార్
ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదని అధికారులు తెలుసుకోవాలని, గతంలో చేసిన పనులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మేల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి 2014 నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, జర్నలిస్టులు, పత్రికల యాజమాన్యాల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్రావు లాంటి వారిని పదవిలో కూర్చోబెట్టి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారన్నారు. ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదని అధికారులు తెలుసుకోవాలని, గతంలో చేసిన పనులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని, ఇది వాస్తవమో కాదో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ‘దళిత బంధు’ పెట్టారని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత బడ్జెట్లో రూ.1.5 లక్షల కోట్లు కేటాయించాలన్నారు.
అవినీతి, అక్రమ సంపాదనలో అగ్రస్థానంలో ఉన్న హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. హైదరాబాద్, హుజూర్నగర్లో భవంతులు నిర్మించుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను హుజూర్నగర్లో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయానన్నారు. సైదిరెడ్డి అవినీతికి కేసీఆర్ బంధువు సంతోష్ సహకారం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఎందుకు భయపడుతున్నారని విలేకరులను ఉత్తమ్ ప్రశ్నించారు.