ఈ క్రమంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అయితే.. భార్యే ఆస్పత్రికి తీసుకువెళ్లి భర్త ప్రాణాలు కాపాడింది.
వారికి పెళ్లై దాదాపు 15 సంవత్సరాలు అయ్యింది. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనందంగా సాగుతున్న వారి సంసారంపై మద్యం కాటువేసింది. భర్త మద్యం మత్తులో కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అయితే.. భార్యే ఆస్పత్రికి తీసుకువెళ్లి భర్త ప్రాణాలు కాపాడింది. అలాంటి..తన ప్రాణాలు కాపాడిన దేవత లాంటి భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దాసర్లపల్లికి చెందిన ఎర్గమెని మహేందర్ కు అదే మండలానికి చెందిన సారమ్మ(33) తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు వీరి సంసారం సవ్యంగా సాగింది. ఆ తర్వాత మహేందర్ మద్యానికి బానిసగా మారాడు.
ఈ క్రమంలో మద్యానికి డబ్బులేదని మూడు నెలల క్రితం పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. భార్య సారమ్మ.. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడింది. చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన తర్వాత కూడా అతనిలో మార్పులేదు. మళ్లీ మద్యం సేవించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో.. తాజాగా నిద్రపోతున్న భార్య మెడను కత్తితో నరికి ఇంట్లో నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టిమిట్టాడి.. సారమ్మ ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
