పీకలదాకా మద్యం తాగించి.. రౌడీ షీటర్ దారుణ హత్య
ఆదిల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దుర్మార్గాలు చేయడం మొదలుపెట్టాడు. కాగా.. తన విషయాలన్నింటినీ సయ్యద్ పోలీసులకు చేరవేస్తున్నాడని ఆదిల్ అనుమానించాడు.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. రౌడీ షీటర్ సయ్యద్ వాహీద్ ని పథకం ప్రకారం మద్యం పీకలాదాకా తాగించి హత్య చేసినట్లు తేలింది. కాగా.. ఈ హత్య కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ కి చెందిన రౌడీ షీటర్ సయ్యద్ వాహీద్ (30) కు మెహదీపట్నానికి చెందిన ఆదిల్(24) మూడేళ్ల క్రితం చంచల్ గూడ జైల్లో పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే.. ఆదిల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దుర్మార్గాలు చేయడం మొదలుపెట్టాడు. కాగా.. తన విషయాలన్నింటినీ సయ్యద్ పోలీసులకు చేరవేస్తున్నాడని ఆదిల్ అనుమానించాడు.
ఈ క్రమంలోనే సయ్యద్ ని చంపేయాలని ప్లాన్ వేశాడు. మరికొంత మంది స్నేహితులతో కలిపి పథకం వేశాడు. ప్లాన్ లో భాగంగానే ఆదిల్.. ఈ నెల 10వ తేదీన సయ్యద్ ని తన వెంట బైక్ పై బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ చాలా సేపు మద్యం తాగారు. అనంతరం ఆదిల్.. మరో ఆరుగురు స్నేహితులతో కలిసి అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కాగా.. కేసు చేధించిన పోలీసులు నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.