మూసీనదిలో అక్కాచెల్లెళ్ల శవాలు... నిందితుడు అరెస్ట్
లంగర్ హౌస్ పరిధిలో ఇటీవల ఇద్దరు అక్కచెల్లెళ్లు మూసీనదిలో శవాలై తేలిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లంగర్ హౌస్ పరిధిలో ఇటీవల ఇద్దరు అక్కచెల్లెళ్లు మూసీనదిలో శవాలై తేలిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్ ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
కేసు పూర్తి వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బరగూడెం గ్రామానికి చెందిన యాదమ్మ(50), సుమిత్ర(40)లు సోమవారం సాయంత్రం కల్లు కోసం కంచన్ బాగ్ వెళ్లారు. సాయంత్రం 6 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో యాదమ్మ భర్త రాజు ఫోన్ చేసి విచారించాడు. వస్తున్నామంటూ యాదమ్మ భర్తకు చెప్పింది.
ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. తీరా.. అత్తాపూర్ మూసీ నదిలో శవాలై కనిపించారు. కాగా.. వీరిని అంకూరి గిరి అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న బంగారం కోసం.. ముందుగా వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం వారిని అత్తాపూర్ మూసీనది వద్దకు తీసుకువెళ్లాడు.
అక్కడ వారి గొంతు నులిమి హత్య చేశాడు. వారి వద్ద ఉన్న బంగారాన్ని తీసుకున్నాడు. అనంతరం ఇద్దరి మృతదేహాలను మూసీలో పడేశాడు. కాగా ఈ దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.