తెలంగాణ ప్రజలకు అభినందనలు: రామప్పకు యునెస్కో గుర్తింపుపై మోడీ స్పందన
వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యాటకులు సందర్శించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
Also Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుంచి వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డుల్లోకెక్కింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ 1213లో నిర్మించిన రామప్ప ఆలయాన్ని.. శిల్పి రామప్ప పేరుతోనే పిలుస్తున్నారు.