నా యాత్రకు అనుమతివ్వండి: స్వామి పరిపూర్ణానంద
తన యాత్రకు అనుమతివ్వాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణానందస్వామి యాత్ర తలపెట్టాడు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
హైద్రాబాద్: శాంతి యుతంగా రామనామజపం చేస్తూ తాను పాదయాత్ర నిర్వహిస్తానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. తన యాత్రకు సహకరించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను శాంతియుతంగా యాత్రను సాగిస్తానని ఆయన చెప్పారు.తన రక్షణపై పోలీసులకు చిత్తశుద్ది ఉంటే తనను అడ్డుకొంటున్నవారిని అరెస్ట్ చేయాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. తన ఇంటి వద్ద వందలాది మంది పోలీసులను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
శాంతియుతంగా యాత్ర నిర్వహించేందుకు వీలుగా తన ఒక్కడికే యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. హిందూ సమాజం ప్రతినిధిగా యాత్రను చేస్తానని ఆయన చెప్పారు.
తన వ్యక్తిత్వంపై నమ్మకం ఉంటే తన యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేస్తానని స్వామి పరిపూర్ణానంద ప్రకటించిన విషయం తెలిసిందే.