హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. వందేళ్ల క్రితం నిజాం హయాంలో కనిపించిన పరిస్థితులు మళ్లీ కనిపించాయి

హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. వందేళ్ల క్రితం నిజాం హయాంలో కనిపించిన పరిస్థితులు మళ్లీ కనిపించాయి. వూళ్లు, ఏర్లు ఏకం కావడంతో హైదరాబాదీలు విలవిలలాడారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కురిసిన వర్షం చాలని.. మళ్లీ వానలు కురిపించొద్దంటూ శ్రీ వెంకటేశ్వరుని ప్రార్ధించారు అర్చకులు. ఇందుకు సంబంధించి గురువారం ఉదయం గండిపేట చెరువు ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారీ వర్షాలతో మంచి వర్షపాతాన్ని అందించిన వరుణ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రాలలో వర్షాలు పడకుండా చూడాలని వేద మంత్రాల ద్వారా కోరారు అర్చక స్వాములు.

ఇప్పటికే భాగ్యనగరం కకావికలమైపోయిన సమయంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని ఆందోళనకు గురయ్యారు.

ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోవడంతో.. ప్రజల తరపున వేద పండితులు చిలుకూరు బాలాజీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కోవిడ్ 19 ముప్పు కూడా తొలగిపోవాలని వారు ప్రార్థనలు జరిపారు.