టీ జేఏసీ చైర్మన్ కు మరోసారి బహిరంగ లేఖ సంధించిన పిట్టల వర్గం

తెలంగాణ రాజకీయ జేఏసీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం మొదటి సారి నిరసగళం వినిపించిన జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ ఆ తర్వాత కోదండారం టార్గెట్ గా విమర్శలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

ఇటీవల మరో ఇద్దరు జేఏసీ నేతలతో కలిసి కోదండరాం కు బహిరంగ లేఖ రాసిన పిట్టల రవీందర్ ఈ రోజు ఏకంగా వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ నేతలతో సమావేశమై మరో బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.

హైదరాబాద్ లోని అశోక హోటల్ వేదికగా జేఏసీ కో చైర్మన్ నల్లపు ప్రహ్లాద్ అధ్యక్షతన 22 మంది జేఏసీ నేతలు సమావేశమై కోదండరాం తీరుపై చర్చించారు. ఇటీవలే పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, తన్నీరు సుల్తానా కలిసి కోదండరాంకు రాసిన లేఖలోని విషయాలను ఈ సమావేశం సమర్థించింది.

అనంతరం కోదండరాంకి మరో బహిరంగ లేఖ రాశారు. జేఏసీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. టీ జేఏసీ రాజకీయ పార్టీగా మారదని ఓ వైపు ప్రకటిస్తూనే.. మరో వైపు తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు.

జేఏసీ రాజకీయ పార్టీలతో కలిసి పని చేయదని చెబుతూనే.. ఆయా పార్టీల నేతలను ఎందుకు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని అడిగారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే అవకాశం లేదన్నారు. జేఏసీ సమావేశాలతో పాటు ఇతర సమావేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లారే తప్ప... ఏనాడూ కూడా మిగతా జేఏసీ నేతల గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కోదండరాం జేఏసీ నేతలతో కలిసి ముందుకెళ్లాలని చెప్పారు.