ఖమ్మానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది.ఈ పిల్ పై కోర్టు ఇవాళ విచారణ జరిపే అవకాశం ఉంది. 

హైదరాబాద్: Khammam లో BJP కార్యకర్త Sai Ganesh ఆత్మహత్యపై CBI విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది.ఈ పిల్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 14న ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగిన సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు. తనపై మంత్రి Puvvada Ajay Kumar 16 కేసులు పెట్టించాడని సాయి గణేష్ చెప్పారు. అంతేకాదు తనపై రౌడీ షీట్ ను కూడా ఓపెన్ చేశారని సాయి గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మీడియాకు చెప్పారు. తాను పురుగుల మందు తాగడానికి మంత్రి పువ్వాద అజయ్ కుమార్ వేధింపులే కారణమని కూడా ఆయన మీడియాకు వివరించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు.

ఈ నెల 20వ తేదీన సాయి గణేష్ ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. అదే రోజున రాజ్ భవన్ లో తమిళిసైసౌందరరాజన్ తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

సాయి గణేష్ ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మంలో మంత్రి ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి., ప్రభుత్వాసుపత్రిలో కూడా దాడికి దిగారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆందోళనలు చేశారు.

ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమంగా కేసులు పెట్టించిన విషయం వెలుగు చూసింది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనల కార్యక్రమాలు చేయనుంది. ఖమ్మంలో పోలీసుల తీరును విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

సాయి గణేష్ ఆత్మహత్య చేసుకొన్న అంశాన్ని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సాయి గణేష్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాయి గణేష్ కుటుంబ సభ్యులను రెండు రోజుల క్రితం పరామర్శించారు. 

సాయి గణేష్ ఆత్మహత్య విషయాన్ని తీసుకొని రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏ రకంగా వ్యవహరిస్తుందోననే విషయమై ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది. మరో వైపు ఈ ఘటనకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బాధ్యుడిగా చేసి మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై ఎఫ్ఐఆర్ లో పువ్వాడ అజయ్ కుమార్ పేరును చేర్చాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.