తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల  భర్తీ సంబంధించి కొనసాగుతున్న ఫిజికల్ ఈవెంట్స్‌లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ సంబంధించి కొనసాగుతున్న ఫిజికల్ ఈవెంట్స్‌లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫిజికల్ ఈవెంట్స్‌లో భాగంగా అభ్యర్థుల ఎత్తు కొలిచే డిజిటల్ మీటర్లలో తప్పులు ఉన్నాయని రాజేందర్ అనే అభ్యర్థి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఫిజికల్ ఈవెంట్స్‌లో అభ్యర్థుల ఎత్తు కొలతలకు సంబంధించిన వీడియోను పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు రిక్రూటమ్‌మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. 

ఇక, డిసెంబర్ 8 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియలో భాగంగా తొలుత పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల రన్నింగ్​, మహిళా అభ్యర్థులకు రన్నింగ్ నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఎత్తును కొలుస్తారు. ఎత్తు కొలతలో అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షాట్‌పుట్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పలు సూచనలను కూడా పోలీసు రిక్రూట్‌మెంట్ చేసింది. ఇక, 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

అయితే ఫిజికల్ ఈవెంట్స్‌ ప్రస్తుతం గర్భిణిలుగా ఉన్న అభ్యర్థులకు మినహాయింపు ఇస్తూ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో.. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొన‌కుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు క‌ల్పించింది.. మెయిన్స్‌లో వారు ఉత్తీర్ణత సాధిస్తే.. నెల రోజుల్లోపు ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.