ప్రజా సమస్యలపై భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి ఉద్యమించటానికి పవన్ ఆశక్తి చూపుతున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి ముందడుగు వేయాలని సినీనటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై తన మనసులోని మాటను, ఆలోచనను తమతో పంచుకున్నట్లు రామకృష్ణ ‘ఏషియానెట్’ తో చెప్పారు.
నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, ప్రభుత్వం చేస్తున్న భూ సమీకరణ, ప్రత్యేకహోదా, చట్టబద్దత లేని ప్రత్యేక ప్యాకేజి తదితర అంశాలపై తాము చర్చించుకున్నట్లు కార్యదర్శి తెలిపారు. నోట్ల రద్దు సామాన్యుల కోసం చేసింది కాదన్న తమ అభిప్రాయంతో పవన్ కూడా ఏకీభవించినట్లు చెప్పారు.
అదేవిధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రత్యేకహోదాను కాదని చట్టబద్దత లేని ప్రత్యేక ప్యాకేజిని ప్రభుత్వం ఏ విధంగా ఆహ్వానించిందో అర్ధం కావటం లేదని పవన్ వ్యాఖ్యానించినట్లు రామకృష్ణ తెలిపారు. అలాగే, రాజధాని కోసం కానీ లేదా బందర్ పోర్టు అభివృద్ధి పేరుతో గానీ అవసరాలకు మించి రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేయటం పట్ల పవన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు కార్యదర్శి చెప్పారు.
ప్రజా సమస్యలపై భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి ఉద్యమించటానికి పవన్ ఆశక్తి చూపుతున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. తదుపరి భేటీలో అనేక అంశాలపై మరింత స్పష్టత వస్తుందని కూడా చెప్పారు.
