తెలంగాణలో 24 సీట్లకు పోటీ చేద్దామని అనుకున్నా: పవన్ కల్యాణ్
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు.
విజయవాడ: తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే చూడలేకనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత శనివారం ఆయన మాట్లాడారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. ఏపీలో పర్యటన ముగించిన తర్వాత తెలంగాణ గురించి ఆలోచిద్దామని అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలు వచ్చాయని అన్నారు.. ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదని, తాము 24 సీట్లకు పోటీ చేద్దామని అనుకున్నామని ఆయన చెప్పారు.
2014 ఎన్నికల్లో ప్రజలకు అండగా ఉంటారనే తాను బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని స్పష్టం చేశారు. సంపాదన వదిలేసి మరి ఆ రెండు పార్టీలకు అండగా నిలిచానని అన్నారు. కానీ చంద్రబాబు అనుభవం ప్రజలను అయోమయంలోకి నెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై సీఎం మాట మార్చడం వల్లే ప్రజలు గందరగోళానికి గురయ్యారని అన్నారు.
హోదాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే జనసేన కూడా వస్తుందని చెప్పారు. అఖిలపక్ష నాయకులంతా ప్రధాని మోడీని కలవాలని సూచించారు. రాజకీయ జవాబుదారీ కోసమే ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు నిర్వహిస్తుందన్నారు.