మునుగోడ్ ఉప ఎన్నికవేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పల్లె రవి కుమార్ దంపతులు గుడ్ బై చెప్పారు. 

మునుగోడ్ ఉప ఎన్నికవేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పల్లె రవి కుమార్ దంపతులు గుడ్ బై చెప్పారు. పల్లె రవి కుమార్, ఆయన భార్య, కల్యాణి కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.అన్ కండిషనల్‌గా టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపిన పల్లె రవికుమార్ తెలిపారు. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం అని చెప్పారు. పల్లె రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరి కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. 

పల్లె రవి భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు కాంగ్రెస్ ఎంపీపీగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లె రవి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే పల్లె రవి కుమార్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ‌నేతలు ఆయనతో చర్చలు జరిపి.. పార్టీలోకి తీసుకురావడంలో విజయవంతం అయినట్టుగా తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు అయిన పల్లె రవి కుమార్.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 

మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలుపు కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలలోని ముఖ్య నాయకులకు గాలం వేస్తున్నాయి.