గుడ్డు అడిగితే గొడ్డును బాదినట్టు బాదారు: గర్భస్రావం
ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలంలోని మద్దిరాల తండాలోని అంగన్ వాడీ కేంద్రంలో దారుణం చోటు చేసుకొంది.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలంలోని మద్దిరాల తండాలోని అంగన్ వాడీ కేంద్రంలో దారుణం చోటు చేసుకొంది. పోషకాహరం కోసం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన గర్భిణీపై ఆయా దాడి చేయడంతో బాధితురాలికి గర్భస్రావమైంది.
గర్బిణీ స్త్రీలకు అంగన్ వాడీ కేంద్రాల నుండి పౌష్టికాహరాన్ని అందిస్తుంటారు.ఈ పౌష్టికాహరంలో భాగంగా గోధుమపిండి, కోడిగుడ్లు ఇస్తారు. అయితే గర్భిణీగా ఉన్న తనకు కనీసం కోడిగుడ్లతో పాటు పౌష్టికాహరం తనకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని మాణోతు పద్మ అనే ప్రశ్నించింది.
అయితే అంగన్ వాడీ ఆయాను ప్రశ్నిస్తే ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అంతేకాదు పద్మతో ఆమె ఘర్షణకు దిగింది. అక్కడే ఉన్న ఆయా భర్త కూడ బాధితురాలిపై దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. అంతేకాదు ఆమెకు అక్కడే గర్భస్రావమైంది.
బాధితురాలిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. అంగన్ వాడీ కేంద్రం వద్ద ఉన్న టీచర్ ఉన్న కూడ ఆయాతో పాటు ఆమె భర్త దాడి చేయడాన్ని నివారించలేకపోయింది.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.